సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 27, 2012

రావుడు నుంచి "రామం" వరకూ...నాన్న కథ - 6 !!

while recording for 'gala gala gOdAri' at antarvEdi

రెండు మూడు రోజుల పాటు ఇంట్లో రామం కనబడకపోతే అవార్డ్ ప్రోగ్రాం చేస్తున్నాడని అర్ధమయ్యేది అతని కుటుంబానికి.
తిండీ, నిద్ర మానుకుని అకుంఠిత దీక్షతో అతను చేసిన అవార్డ్ ప్రోగ్రాం ల కథాకమామిషు:


1.1980 - నీలినీడలు ( సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రధమ బహుమతి)
ఐదవ భాగం చివరలో ఈ కార్యక్రమం తాలూకు వివరాలు రాసాను.


2. 1982 - We Two (సృజనాత్మక శబ్దచిత్రం -- ఎంట్రీ)

3. 1983 - లహరి ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
మానవుడి దైనందిన జీవితంతో సంగీతం ఒక అంతర్భాగంగా ఎలా పెనవేసుకుపోతోందో ఉదాహరణలతో సహా వివరించే రూపకం. కార్యక్రమం చివరలో సినిమా ట్రైలర్ మాదిరే ప్రత్యేకంగా తయారుచేసిన ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్రీల్ ప్రతీక ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రోగ్రాం విని మన తెలుగువారు, ప్రముఖ వేణుగాన విద్వాంసులు,అప్పట్లో ఫిల్మ్ డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏల్చూరి విజయరాఘవరావుగారు ఇందులోని కొన్ని అంశాలనూ, కాన్సెప్ట్ నీ స్మగుల్ చేయాలనిపించింది అని మెచ్చుకుంటూ రెండు పేజీల ప్రశంసాపూర్వక ఉత్తరం రాయటం రామానికి ఎంతో ఉత్సాహం ఇచ్చింది.

4.1984 - సారే జహాసే అచ్ఛా (సృజనాత్మక శబ్దచిత్రం -- ప్రశంసాపత్రం)
చిన్నప్పుడూ social studies లెసన్స్ లో బోలెడన్ని హిందూదేశపటాలు ఉండేవి. వరి,గోధుమ ,తేయాకు పండు ప్రదేశములు, భారత దేశంలో వివిధ నదులు,భారత దేశంలో రైలు మార్గాలు ఇలా ఒకో పటం ఒకో రకం. కానీ అన్నీ భారత దేశ పటాలే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తీసుకుని వివిధ అంశాలు వినబడేలాగ మూడు నిమిషాల వ్యవధిగల భారత దేశ సౌండ్ మ్యాప్ లు వినిపిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది రామానికి. అంటే ఆధ్యాత్మిక భారత దేశం, దేశభక్తుల మహామహుల భారత దేశం, ఆకలిదప్పుల భారత దేశం, ప్రకృతి సౌందర్యాల భారత దేశం, పురాతన సంగీత పరంపర గల భారత దేశం, సాంకేతిక వైజ్ఞానిక ప్రగతితో పరిఢవిల్లే భారత దేశం ఇలాంటివన్న మాట. అన్నీ శబ్దమయంగానే. వీటన్నింటితో నిండిన సమగ్ర భారత దేశమే "సారే జహాసే అచ్ఛా" అని తేల్చి చెప్పటం.

5.1985 - ఒక పాట పుట్టింది (సృజనాత్మక రూపకం ఎంట్రీ)
ఆకాశవాణిలోనూ, సినిమాల్లోనూ వందలాది పాటలు తయారవుతూ ఉంటాయి. ఒకో పాటకూ ఒకో చరిత్ర ఉంటుంది. (బాలు గారు ’పాడుతా తీయగా”లో చెప్తున్నట్లు) కానీ ఒక్క పాట తయారవ్వాలంటే ఎందరో వ్యక్తుల శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. పాట వినే సామాన్య శ్రోతకి దాని వెనుక దాగిన తయారీ గురించి తెలిసే అవకాశం తక్కువ. ఎవరో పాట రాసి ఇస్తే, ఎవరో స్వరాలు చేకూరిస్తే, మరొకరు కంఠాన్ని జోడిస్తే, ఇంకొంతమంది వాద్య సహకారాన్ని అందిస్తే , ఒక సాంకేతిక నిపుణుడు రికార్డ్ చేసేస్తే పాట తయారీలో కష్టమేముంది? ఒకో పాటకి ఒకోసారి పదిహేను ఇరవై టేక్స్ దాకా ఎందుకు అవసరం అవుతుంది? దర్శకుడు వివరించిన సన్నివేశానికి ఐదారు రకాలుగా అక్షరాల అల్లిక రచయిత తయారుచేస్తే, అందులో ఒక్కటే ఎలా ప్రాణం పోసుకుంటోంది? సంగీత దర్శకుడు కూడా ఐదారు రకాల బాణిలు వినిపిస్తే అందులో ఒక్కటే ఎలా హిట్ అవుతోంది? గాయకుడికీ, వాద్యబృందానికీ స్వరలిపి ఇచ్చి రిహార్సల్స్ చేసిన తరువాత కూడా ఎక్కువ టేక్స్ ఎందుకు అవసరమౌతున్నాయి? రికార్డింగ్ స్టుడియోలో జరిగే వింతలు విశేషాలూ ఏమిటి? మొదలైన అంశాలన్నీంటినీ సామాన్య శ్రోతకు కూడా అర్ధమయ్యేలాగ వివరిస్తూ ఒక పాట చివరికి ఎలా పుడుతుందో తెలియజేసే సృజనాత్మక రూపకం ఇది. ఈ పాటకు స్వరకర్త విజయరాఘవరావుగారే కావటం వల్ల ఇందులోని నావెల్టీని ఆయన బహుధా ప్రశంసించారు.

ఈ ప్రోగ్రాం ను documentary feature గా పంపించి ఉంటే అవార్డ్ వచ్చి ఉండేదేమో అని తరువాత అనిపించింది రామానికి.

6.1986 - వర్షానందిని (సంగీత రూపకం - ప్రధమ బహుమతి)

7.1986 - నేను కాని నేను (సృజనాత్మక శబ్దచిత్రం - ప్రధమ బహుమతి)
సాధారణంగా సినిమాల్లో పాట రచన పూర్తయ్యాకా స్వరపరచటం ఒక సంప్రదాయ పధ్ధతి కానీ ఒకోసారి దానికి విరుధ్ధంగా ట్యూనే ముందు తయారయి అక్షరాల అమరిక తరువాత జరగటం కూడా మనకు తెలుసు. ఈనాటి పాటల్లో ఎక్కువభాగం ఇలా తయారవుతున్నవే. ఇదే ఒరవడిలో పదహారు శబ్దచిత్రాలను sound effects and musicతో కలిపి ముందుగానే తయారు చేసి ఈ సీరీస్ మొత్తాన్ని రచయిత, రేడియో మిత్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారికి వినిపించి ఆయన స్పందన వచన కవితా రూపంలో రాయించి రివర్స్ లో తయారైన సృజనాత్మక కార్యక్రమం ఇది. దీనికి ఆంగ్లానువాదం తయారుచేసిన ప్రముఖ నైరూప్య వచన కవి శ్రీ "మో" (వేగుంట మోహనప్రసాద్)గారికి ఈ కార్యక్రమం అవార్డ్ రాకముందే ఎంతగానో నచ్చింది. ఈ కార్యక్రమం వింటుంటే ఇటివల వచ్చిన క్రిష్ చిత్రం ’వేదం’ స్క్రీన్ ప్లే లా ఉంటుంది.

8.1987 - స్మృతి (రేడియో నాటకం - ప్రశంసాపత్రం)

9.1988 - నిశ్శబ్దం గమ్యం (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
నిశ్శబ్దంలోంచి పుట్టిన మానవుడు తిరిగి నిశ్శబ్దంలోకే నిష్క్రమిస్తాడు.మధ్యలో మాత్రమే ఎంతో సందడి. అందుకే "రెండు చీకట్ల మధ్యన వెలుగు తోరణం నరుడు" అన్నారు శ్రీకాంతశర్మగారు. ఏనాడో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా ఒక షార్ట్ ఫిల్మ్ కోసం రాసుకున్న అల్లిబిల్లి ఐడియాల సమాహారమే ఈ శబ్ద చిత్రం. అతి చిన్న నీటి బిందువు నుంచి అతి భీకరమైన మేఘ గర్జన వరకూ, చెక్కిలిపై చెక్కిలి ఆనించి వినిపించే గుసగుస మొదలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే జనఘోష వరకూ, భళ్ళుమని శబ్ద ప్రకంపనలతో మొదలయ్యే వేకువ నుంచి నీరవ నిశీధిలో నక్షత్రాల రోదసీ సంగీతం వరకూ ఎన్ని అంతరాలున్నాయో శబ్ద మూలంగా వివరిస్తూ చివరకు ధ్యానంవల్ల సాధించే నిశ్శబ్దమే మనిషికి ఊరటనిస్తుంది అని ప్రతిపాదించే శబ్ద చిత్రం ఇది.

10.1990 - మెట్లు (సృజనాత్మక శబ్దచిత్రం -- ద్వితీయ బహుమతి)
మనిషి ఉన్నతికి దోహద పడేది మెట్టు. పైకి చేరిన స్థానాన్ని నిలబెట్టుకోలేకాపోతే అధోగతికి తోసేది కూడా ఆ మెట్టే. ఇది ఇందులోని ప్రధాన ఇతివృత్తం. ఎన్నో స్థాయిలు అధిగమించి ప్రేమ సాఫల్యాన్ని పొందుతారు ప్రేమికుల జంట. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్క మెట్టే ఎక్కి పదోన్నతులు పొందుతారు. అష్టాంగమార్గాన్ని ప్రబోధించిన గౌతమబుధ్ధుడు కూడా ఓ అర్ధరాత్రివేళ తన కుటుంబాన్నీ, రాజ్యాన్నీ, త్యజించి, రాజప్రాసాదం మెట్లు దిగి విశాల ప్రపంచంలోకి అడుగిడి, తిరిగి బౌధ్ధభిక్షువుగా అదే సోపానాల వద్దకు రావటం జీవిత పరిణామక్రమంలో సంభవించిన అద్భుత దృశ్యం. ఇన్ని రకాల మెట్లు గురించి వివరిస్తూ ఒక తల్లి తన పసి కుమారుణ్ణి చెయ్యి పట్టుకుని ప్రకృతి మానవుణ్ణి నడిపిస్తున్న రీతిలో కొనసాగిస్తూ చూపటం ఈ సృజనాత్మక రూపకంలో శ్రోతల్ని ఆకట్టుకునే ప్రధానాంశం.


11.1991- గలగల గోదారి (డాక్యుమెంటరీ -- ఎంట్రీ)
నాసికాత్రయంబకం దగ్గర గోముఖం నుంచి బిందు రూపంలో మొదలైయ్యే గోదావరి అంతర్వేది వద్ద సాగరసంగమం చెందేవరకూ గోదావరి సజీవ యాత్ర ఈ డాక్యుమెంటరీలో వినిపిస్తుంది. అదే సంవత్సరంలో యమునా నదిపైన కూడా డాక్యుమెంటరీ ఎంట్రీ రావటంతో గోదావరి చిన్నబోయిందని తెలిసింది. అయితే, ఈ కార్యక్రమం కోసం రామం, శ్రీకాంత శర్మగారు, మిగిలిన టేక్నికల్ టీం నాసిక్ మొదలు కోనసీమ దాకా ఒక నెల రోజులు తిరగటం మాత్రం రామం స్మృతులలో ఒక అందమైన ప్రయాణం.

'mahavishva' recording
12.1992 - మహావిశ్వ (రేడియో నాటకం(సైన్స్ ఫిక్షన్) -- ద్వితీయబహుమతి)


ఆకాశవాణిలో ఈ నాటకానికి ఒక చరిత్ర ఉంది. చాలా అరుదైన సైన్స్ ఫిక్షన్ నాటకం ఇది. స్పెషల్ ఐ.జి.పి, రచయిత, కవి కె.సదాశివరావుగారు ’ఇండియా టుడే ’ తెలుగు మ్యాగజైన్లో రాసిన "మానవ ఫాక్టర్" అనే సైన్స్ ఫిక్షన్ కథ దీనికి మూలం. ఈనాడు మనిషి గ్రహాంతరాల వైపు అడుగు సారిస్తున్నాడు. చంద్రుడి పైన ఎప్పుడో కాలు మోపాడు. మానవ వాస యోగ్యమైన ఇతర గ్రహాలేమైనా ఉన్నాయేమో అని కూడా పరిశోధిస్తున్నాడు. చండ్రుడిపైన, మార్స్ పైన అనతికాలంలో మనిషి నివాసాన్ని ఏర్పరుచుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. దానికి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. భూమి పైన పెరుగుతున్న జనాభా విస్ఫోటనం వల్ల, భూవనరులు తరగిపోవటం వల్ల మనిషి ఇతర గ్రహాల వైపు దృష్టి సారించక తప్పేలాలేదని శాస్త్రజ్ఞులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇంతే కాక పరస్పర కలహాలు, వాతావరణ కాలుష్యం, అణుయుధ్ధాలు మొదలుగా గల మనిషి స్వయంగా తెచ్చిపెట్టుకుంటున్న అనర్ధాలు కూడా ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. దానా దీనా మానవజాతే అంతరించే ప్రమాదం గానీ, ఈ భూగ్రహం నుంచి ఫలాయనం చేయవలసిన అగత్యం ఏర్పడవచ్చు.


ఈ నేపథ్యం ఆధారంగా ఇప్పటికి 400 సంవత్సరాల తరువాత మానవ మనుగడ ఎలా ఉంటుంది? అప్పటికి గ్రహాంతర వాసానికి అలవాటు పడిపోయిన వైజ్ఞానిక మానవుడు ఎలా ఉంటాడు? రోబోలే సేవకులు, పరిచారికలు ఐతే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన ఆథెన్టిక్ ఇన్ఫర్మేషన్ తో సదాశివరావుగారు చేసిన విచిత్ర కల్పన ఈ కథ. దీనికి రేడియో అనుసరణ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు చేయగా, రసవత్తరమైన వైజ్ఞానిక నాటకంగా రెండు నెలలు అవిశ్రాంతమైన కృషి చేసి రామం దీనిని రూపొందించాడు. ఇంత శక్తివంతమైన కథావస్తువుకు అనుగుణమైన సంగీతం సమకూర్చాలి అనే ఉద్దేశంతో అధికారుల ప్రత్యేక అనుమతి తీసుకుని చెన్నై నుంచి సినీ ఆర్కెస్ట్రాని తెప్పించి ఒక నాటకానికి కేవలం నేపథ్యసంగీతం రికార్డ్ చేసేందుకు AIR వేలకువేల బడ్జట్ ఖర్చుపెట్టడం అదే మొదలు. ఈ కథాగమనంలో రెండు రోబోలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకోసం కూడా ప్రత్యేకమైన సాంకేతిక పరికరాలను చెన్నై సినీ ఫీల్డ్ నుంచి తెప్పించటం జరిగింది.


జాతీయ బహుమతి ఇవ్వటమే కాకుండా ఈ నాటకాన్ని ఆకాశవాణి ఢిల్లీలో ఒక మోడల్ ప్లే గా కూడా పెట్టడం విజయవాడ స్టేషన్కు గర్వకారణం.


13.1992 - 29minutes - 4th dimension (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
రామానికి వచ్చిన పది జాతీయ బహుమతుల్లో ఈ ప్రోగ్రాం చోటు చేసుకోలేకపోయినప్పటికీ ఈ ప్రోగ్రాం పట్ల అతనికి ప్రత్యేకమైన అభిమానం. తన ఆలోచనా సరళి, తన ఆత్మ ఇందులో ప్రతి అడుగడుగునా ప్రతిఫలిస్తుందని రామం ఎప్పుడూ అంటాడు. దీని పూర్తి రచన, తయారీ తన స్వభావ సరళికి అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది. శ్రీకాంతశర్మగారి కవితా సంపుటి "నిశ్శబ్దం గమ్యం" నుంచి తనకిష్టమైన కొన్ని కవితలు కూడా తానే ఇందులో చదవటం జరిగింది. సందర్భాన్ని అనుసరించి చలంగారి వాణిని, అలాగే ఒక పసిపాప కంఠాన్ని, ఠాగూర్ రచన "where the mind is without fear",
దానికి రజని తెలుగు అనువాదం "చిత్తమెచట భయ శూన్యమో.."(బృందగాన రూపంలో) ఇందులో వినియోగించటం జరిగింది. మన ప్రియతమ భారతదేశాన్ని ఇంత ఆదర్శవంతమైన దేశంగా మనం ఎప్పటికైనా పుననిర్మించుకోగలమా అని రామం ఆశ. రామం కల కూడా.


14.1995 - మ్యూజిక్ ఫ్యాక్టరీ ( సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)


15.1996భూమిగీత (సంగీత రూపకం -- ప్రధమబహుమతి)
ఈ సంవత్సరంలోనే Brazil లోని రియో డిజనిరియో లో ఎర్త్ సమిట్ జరిగింది. అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా పాల్గొంది. ఈ భూగ్రహాన్ని ఎలా కాపాడుకోవాలి్? ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి/ మానవుడి మనుగడ ఏ దిశ వైపు? మొదలైన అనేక అంశాలు అక్కడ చర్చించటం జరిగింది. మన దేశం ప్రధాన పాత్ర వహించింది కూడా. దీని ఆధారంగా రూపొందించిన సంగీతరూపకం ఇది. చక్కని సంగీతం, ఆకర్షణీయమైన సౌండ్ ఎఫెక్ట్స్ గల ఈ రూపకం జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవటమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచీ ఒకేసారి ప్రసారం చేయబడింది కూడా.


16.1997 యాత్ర (సృజనాత్మక రూపకం -- మొదటి బహుమతి)
తాత్కాలికంగా తను ప్రేమించిన వ్యక్తికి దూరమైన ఒక వనిత ఒంటరి పయనం సాగిస్తూ రకరకాల ఋతువుల్లో అతనికై అన్వేషణ సాగిస్తూ తీపి జ్ఞాపకాల భూతకాలంలోకి వెళ్తూ, భవిష్యత్తులో తను కలుసుకోబోయే ప్రియుని కోసం భవిష్యత్ కలలు కంటూ ప్రస్తుత వర్తమానం కొనసాగించటం ఈ "యాత్ర"లో ముప్పేటగా సాగిపోతుంది. చిట్టచివరికి వారిద్దరూ కలుసుకోవటంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇందులో అడుగడుగునా సంగీతమే ప్రధాన ఆకర్షణ. ఆ పాటలన్నీ ప్రఖ్యాత గాయని శ్రిమతి ద్వారం లక్ష్మి పాడటం ఓ విశేషం. రామం awards కోసం ఢిల్లీ వెళ్ళిన చివరి యాత్ర కూడా ఇదే.


17. 2000 - శబ్ద2000 (సృజనాత్మక రూపకం -- ఎంట్రీ)
నూతన శతబ్దంలోకి అడుగుపెట్టే తరుణంలో 2YK గురించి అనేక ఊహలు, కలలు ఉండేవి. ఈ చారిత్రాత్మక కాలగతిని స్వయంగా అనుభవించినవారందరూ నిజంగా అదృష్టవంతులే. ఒక నూతన శకంలోకి పాదం మోపబోయే భారత దేశం వెనుతిరిగి చూసుకుంటే తన గత చరిత్ర శబ్ద రూపంలో ఎలా వినిపిస్తుందో అని చేసిన కల్పన ఈ "శబ్ద2000".

రామం జాతీయ అవార్డ్ కార్యక్రమాల పరంపర ఇంతటితో ముగిసింది.

**** *** ***

awards
విజయవాడలో అనేక కళాసంస్థలు రామానికి జాతీయ బహుమతులు వస్తున్న తరుణంలో ఎన్నోసార్లు సన్మానాలు, సత్కారాలు చేసాయి. రేడియో మిత్రులు పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు రామానికి ఎనిమిది అవార్డులు వచ్చిన సందర్భంలో విజయవాడలోనే రామం కుటుంబ సభ్యులందరి సమక్షంలో అపూర్వమైన సన్మానం ఏర్పాటు చేసారు. నెల్లూరు "కళామందిర్", విజయవాడ "మధూలిక", "రసతరంగిణి" విజయవాడ, విజయవాడ "రోటరీ", ఢిల్లీలోని "ఢిల్లీ తెలుగు సంఘం" మొదలైన సంస్థలన్నీ కూడా రామానికి సన్మానాలు చేసాయి.


మద్రాసు తెలుగు అకాడమీ వారు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను సన్మానిస్తూ ఉగాది పురస్కారాలు అందజేయటం ప్రతి ఏటా ఒక ఆనవాయితీ. "ఆకాశవాణి"లో "ట్రెండ్ సెట్టర్" గా ఈ సంస్థవారు 2000సంవత్సరంలో రామానికి మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో మాజీ గవర్నర్ శ్రీమతి వి.ఎస్.రమాదేవిగారి చేతుల మీదుగా 'ఉగాది పురస్కారాన్ని' అందజేసారు.


Ugadi puraskar


విజయవాడ రేడియో కేంద్రానికి మూల స్థంభాలుగా చెప్పుకునే నండూరి సుబ్బారావు, సి.రామ్మోహనరావు స్మారక బహుమతులు కూడా రామానికి లభించాయి. ఇటీవలే హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా "వాచస్పతి పురస్కారాన్ని" కూడా అందుకోవటం జరిగింది.



Sri.K.Vishwanath giving 'vachaspati Award' to ramam



ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతి శనివారం ప్రసారం చేసే "ఈవారం అతిథి" కార్యక్రమంలో జంట రేడియో మిత్రులైన శ్రీ ఇంద్రగంటి శ్రికాంత శర్మ గారినీ, రామాన్ని కలిపి ఒకేసారి పరిచయం చేసారు. అలాగే రైన్ బో ఎఫ్.ఎం లో "సరదా సమయం"లో ఓ గంట సేపు రామం అవార్డ్ కార్యక్రమాల ఆడియో క్లిప్పింగ్స్ తో ఓ పరిచయ కార్యక్రమం ప్రసారమైంది.


రామాయణ మహాకావ్య ఆవిర్భావానికి మూల కారకుడైన వాల్మీకి మహర్షిలాగ రామం ఆకాశవాణి విజయ పరంపరకు మూలం, ప్రేరణ - ప్రముఖ వాగ్గేయకారులు, కవి, రచయిత, గాయకులు, స్వర శిల్పి, రేడియో మాంత్రికుడు "రజని" (డా. బాలాంత్రపు రజనీకాంతరావు) అని రామం ఇప్పటికీ వినమ్రంగా చెప్పుకుంటూ ఉంటాడు. రజని రచించిన ’ఆదికావ్య అవతరణ” సంగీత రూపకాన్ని రంగస్థలంపై నృత్యరూపకంగా చేసిన ప్రదర్శనలో వాల్మీకి వేషం రామం ధరించటం యాదృచ్ఛికం. జాతీయ, అంతర్జాతీయ బహుమతులు రేడియోకి సంపాదించి పెట్టిన రజని పరిపాలనా కాలం విజయవాడ కేంద్రానికి ఎప్పుడూ ఒక స్వర్ణయుగం అని రేడియో శ్రోతలు ఇప్పటికీ అభివర్ణిస్తూఉంటారు. అందుకే ఆయన వర్ణచిత్రాన్ని తన గదిలో అలకరించుకున్నాడు రామం. ఈనాటికీ 90ఏళ్ళ వృధ్ధాప్యంలో కూడా పిలిస్తే పలికే దైవంలాగ సంగీత సాహిత్య రంగాల్లో ఎవరికి ఏ సందేహం వచ్చినా తక్షణం నివృత్తి చేస్తూనే ఉన్నారాయన. నేటికీ పాటే ఆయన ప్రాణం. రామం లాంటి ఎందరో శిష్యప్రశిష్యగణం ఆయన ఆయురారోగ్యాల కోసం నిత్యం ప్రార్ధిస్తూనే ఉంటారు.


Dr.B.Rajanikantha Rao

**** *** ***
ముఫ్ఫై ఏళ్ళ సుదీర్ఘ ఆకాశవాణి అవిశ్రాంత జీవితం తరువాత 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు రామం. గ్రాండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో అన్ని సెక్షన్ల నుంచీ వచ్చిన విజయవాడ ఆకాశవాణి కేంద్ర స్టాఫ్ అందరూ రామాన్ని "అజాతశత్రువు" అని కొనియాడారు. ఆ ఫంక్షన్ లో ఇతర కేంద్రాలనుంచి కూడా రేడియోమిత్రులు వచ్చి పాల్గొన్నారు. అతని సుస్వభావానికి, సహృదయతకూ లభించిన గౌరవం అది.

ఇదీ రామం కథ. ఇది రామం ఒక్కడి కథే కాదు సీతారాముల కథ. విజయపథంలో నిరంతరం కొనసాగే ప్రతి పురుషుని వెనుకా ఒక స్త్రీ ఉంటుందని నానుడి. అలానే 65ఏళ్ల రామం జీవనయానం వెంట జంటగా నడుస్తూ, తన సహకారాన్ని అందిస్తున్నది అతని సహధర్మచారిణి, మీదుమిక్కిలి అతని స్నేహితురాలు, సహజ శాంత స్వభావురాలు, చప్పుడు చెయ్యని వెన్నెల లాంటి సీతామహాలక్ష్మి అనే "సీత".


(కథ...సంపూర్ణం)


14 comments:

Anonymous said...

ఈ పరంపర అప్పుడే ముగిసిందా అనిపిస్తూ ఉంది...

"ధన్యవాదములు" అని ఒక్క మాటతో నా కృతజ్ఞతలు

malli said...

చాలా రోజులకి బాలాంత్రపు వారి ఊసు విన్నా. తెలుగు యునివర్సిటీ లో మాకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వచ్చేవారు నన్ను చూడగానే మల్లీశ్వరిలోని పాటలతో పలకరించేవారు.థాంక్ యూ మీ పోస్ట్ వాళ్ళ మళ్ళీ పాత స్మృతులు..తలచుకున్నా.

వేణూశ్రీకాంత్ said...

అప్పుడే అయిపోయిందా అనిపించింది. చాలా బాగారాశారు తృష్ణ, ఇన్ని వివరాలు అందించినందుకు ధన్యవాదాలు.

sunita said...

baagundanDi. chaalaa baagaa raasaaru.

శేఖర్ పెద్దగోపు said...

నేనెంతో కష్టపడి తీరిక చేసుకుని పేద్ద కమెంట్ రాస్తే పోస్ట్ చేసాక ఎర్రర్ వచ్చింది..అంతా పోయినట్టుంది...ఒకవేళ మీకు అది అందితే దీన్ని పబ్లిష్ చెయ్యెద్దు..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మీనాన్నగారి కార్యక్రమాల్లనే ఈటపాలనికూడా సాగుతున్నంతసేపూ ఎంతగా ఆస్వాదించానో వీడ్కోలు చెప్పేక్షణంలో అంతబాధపడుతున్నాను. మరికొంత విపులంగా కనీసం అవార్డులు వచ్చిన కార్యక్రమాల వరకైనా చెప్పుంటే బావుండేది.
ఎడమచెయ్యిని మానిటర్ పైన పెట్టి కుడిచెయ్యి మూడుసార్లు ఊపాలన్నమాట మేమంతా

తృష్ణ said...

@శేఖర్: అందలేదు...:( మళ్ళీ వీలు చూసుకుని ప్రయత్నించండీ ఓ రెండు వాక్యాలు రాయటానికి...మరి నేను మొదటిసారి ప్రయత్నించిన జీవితకథ ఎలా రాసానో మీరు చెప్పాలి మరి..!

తృష్ణ said...

@మనవాణి: అన్ని భాగాలూ చదివినట్టున్నారు. ధన్యవాదలు.

@మల్లి: ఇప్పటికీ మాట్లాడుతూ మాట్లాడుతూ పాడుతూ ఉంటారు.He is a great man.Knowing him itself is an honour. ధన్యవాదాలు.

@వేణూ శ్రీకాంత్: నిజంగా అలా అనిపిస్తే నా రచనలో జీవం ఉన్నట్లేనండి. చాలా థాంక్స్.

తృష్ణ said...

@సునీత: ధన్యవాదాలు.

@చైతన్య: అవార్డ్ వచ్చిన వాటి గురించి చాలా వరకూ రాసాను. Thanks for following the story..Thank you.

Sravya V said...

అమ్మయ్య మొత్తం అన్నీ బాగాలు , కామెంట్లతో సహ చదివేసాను :) మొత్తం చదివినాక నాకు రామం గారి కన్నా ఎక్కువ క్రెడిట్స్ సీతామహాలక్ష్మి గారికి ఇవ్వాలనిపిస్తుంది .
ఇంత చక్క గా మీ నాన్న గారి గురించిన వివరాలు అక్షరబద్ధం చేసినందుకు అభినందనలు .

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుంది..అన్నీ ఒకేసారి చదవటం వల్ల నాకు ఫ్లో చక్కగా కుదిరింది...అన్నీ టపాల స్పందన ఒకేచోట....
>>>>ఆర్ధికంగా పోషించటానికి వెనుక ఎవరూ లేని నిస్సహాయత ఏదో సాధించాలన్న శ్రీరామ్మూర్తి ఉత్సాహాన్నీ, సృజనాత్మకతనూ నీరుకార్చేసాయి...
చాలా భాదేసింది ఇక్కడ..మా నానమ్మ అంటూ ఉండేది...సరస్వతి కటాక్షం ఉన్నచోట లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్టపడదురా అని...తను అన్నమాటే ఇక్కడ గుర్తుకు వచ్చింది నాకు...
>>>>>తన స్నేహితులకు మల్లె తనకు తండ్రి అండ ఉండి ఉంటే, ఇంకొన్నాళ్ళు మద్రాసులో ఉండగలిగితే వాళ్ళకు లాగే తానూ సినీ పరిశ్రమలో ఉండిపోయేవాడిని కదా అనుకుంటాడు ఇవాళ్టికి కూడా
ఇప్పడైనా నాన్నగారి టాలెంట్‌ను సినీ పరిశ్రమ వాడుకుంటే బావుణ్ణు...ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను..
>>>>ఒక మహా వైభవాన్ని చూసిన మనిషికి, ఏవేవో చెయ్యాలని కలలు కన్న మనిషికి, తనది అనుకునే ప్రపంచం నుంచి వేరు పడిన మనిషికి ఇక ప్రపంచంలో ఏ మూల ఉన్నా పెద్ద తేడా కనబడదు. ఏ పనైనా ఒకటే. అదే నిర్లిప్తతతో పెద్దల తృప్తి కోసం చదువుతో సంబంధం లేని కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు కొన్నాళ్ళు చేసాడు అతను. నేనేమిటి ఇలాంటి పన్లేమిటి అనుకున్న సందర్భాలెన్నో...!
ఎంత భాద అనుభవించి ఉంటారో...అయితేనేమి ఆ తర్వాత కృషికి తగ్గ మంచి గుర్తింపు తెచ్చుకున్నారుగా నాన్న గారు.....
>>>పిల్లల చదువులు మొదలు ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసుకునేది సీత. ఇల్లు మారితే "డ్యూటీ అయ్యాకా ఆఫీసు నుంచి ఫలానా అడ్రస్కు వచ్చేయండి" అంటే అక్కడికి వెళ్ళటం మినహా రామం మరేమీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
గ్రేట్!! హేట్సాఫ్ టు హర్...
ఒక చిన్న ప్రోగ్రాం ఆడియో క్లిప్ పెట్టుంటే బాగుండేదండీ..

తృష్ణ said...

@శ్రావ్య వట్టికూడి: ఆ మాట నిజంగా నిజమండీ.థాంక్యూ.

@శేఖర్: కష్టపడి అంత పెద్ద వ్యాఖ్య మళ్ళీ రాసినందుకు చాలా చాలా థాంక్స్. ఆడియో క్లిప్పింగ్ పెట్టాలండి కానీ టపాలన్నీ పెద్దవి అయిపోవటం వల్ల మధ్యలో కుదరలేదండి. వేరేగా వీలైతే పెట్టాలి మరి.

రామ్ said...

తృష్ణ గారు


మీ బ్లాగ్ చాలా బాగుంది. ఆకాశవాణి మహామహుల తొ గడిచిన మీ బాల్యం ముద్ర మీ రచనల లొ కనపడుతుంది.

నాన్న గారి గురించి చాలా వివరంగా తెలుసుకున్నాను. ధన్యవాదములు. నాన్న గారికి అమ్మ గారికి నా నమస్కారములు.

నేను కిరణ్ గారి ఫ్రెండ్ ని కాకినాడ లొ. తన ఈ మైల్ పంపగలరా.

రాం ఫ్రసాద్ ఎంవీయస్

రామ్ said...

అవునండి నేను MVL గారి అబ్బాయిని. work pressure నుంచి relax అవటానికి, కొత్త విషయాలు తెలుసుకొవటానికి ..... మీ బ్లాగ్ చాలా ఉపయోగ పడుతొంది.

Thank You Very Much !!